కోడంబాక్కం న్యూస్: దివంగత నటి శ్రీదేవి మరణానంతరం బోనీ కపూర్ తన ఇద్దరు కూతుళ్ల పట్ట మరింత శ్రద్ధ తీసుకోవడం ప్రారంభించారు. జాన్వీ, ఖుషి కపూర్‌లను సినిమాల్లో బిజీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టే పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదుగుతోంది. ఇక రెండో కూతురు ఖుషీ కపూర్ కూడా ఇటీవలే తొలిసారిగా నటించింది. ఆమె నటించిన అర్చీస్‌ అనే మూవీ ఇటీవలే నెట్‌ ఫ్లిక్స్‌లో విడుదలైంది. అక్కాచెల్లెళ్లిద్దరూ తమ తల్లి శ్రీదేవి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. గొప్ప నటీమణులు కావాలని తండ్రి బోనీ కపూర్‌ కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే బోనీకపూర్, జాన్వీ, ఖుషీ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల శ్రీదేవి ఫ్యామిలీ తమ పేరిట ఉన్న నాలుగు అపార్ట్‌మెంట్లను అమ్మడమే దీనికి కారణం. బోనీ కపూర్‌ అంధేరీలోని తన 4 ఫ్లాట్లను కూడా భారీ మొత్తానికి విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ నాలుగు ఫ్లాట్లు ముంబైలోని అంధేరిలోని గ్రీన్ ఎకర్స్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ఫ్లాట్లన్నీ రూ.12 కోట్లకు పైగా అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఇందులో అతిపెద్ద ఫ్లాట్ 1870 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ పెద్ద ఫ్లాట్‌ను అంజు నారాయణ్, సిద్ధార్థ్ నారాయణ్‌లకు విక్రయించారట. ఇక జాన్వీ కపూర్ చివరిసారిగా వరుణ్ ధావన్‌తో కలిసి బవాల్ చిత్రంలో కనిపించింది. సినిమా పెద్దగా మ్యాజిక్‌ క్రియేట్‌ చేయలేకపోయింది. అయితే జాన్వీ నటనకు చాలా మంచి పేరొచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఎన్టీఆర్‌ దేవర కూడా ఉంది.