శ్రీ క్రోధి నామసంవత్సరం సంతోషమయం కావాలి!
: డాక్టర్ విఎల్ ఇందిరాదత్

విల్లివాకం న్యూస్: శ్రీక్రోధి నామ సంవత్సరంతో ప్రతీ ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని, సుఖ సంతోషాలతో జీవించాలని డబ్ల్యూటీఎఫ్ అధ్యక్షురాలు డాక్టర్ వి ఎల్ ఇందిరాదత్ ఆకాంక్షించారు. ప్రపంచ తెలుగు సమాఖ్య (డబ్ల్యూటీఎఫ్), గాంధీ నగర్ లేడీస్ క్లబ్ (జిఎన్ఎల్ సి) సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు తమిళ నూతన సంవత్సర వేడుకలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక అడయార్ లోని గాంధీనగర్ లేడీస్ క్లబ్ ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలకు డబ్ల్యూటీఎఫ్, జిఎన్ఎల్సి అధ్యక్షురాలు ఇందిరా దత్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిధిగా విజిఎన్ హోమ్స్ ప్రయివేటు లిమిటెడ్, డైరెక్టర్ పద్మా దేవదాస్
పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ముందుగా ఇందిరాదత్ స్వాగతోపన్యాసం చేస్తూ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందిస్తూ తమ సంస్థ తెలుగుభాష వికాసానికి పాటుపడుతుందని అన్నారు. రెండు సంస్థలు కలిసి తెలుగు ,తమిళ నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ తెలుగు, తమిళ నూతన సంవత్సరంలో ప్రతీ ఒక్కరూ సంతోషంగా జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారని పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథిని డబ్ల్యూ టి ఎఫ్ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ మోహన రావు సభకు పరిచయం చేశారు. అతిథి పద్మా దేవదాస్ మాట్లాడుతూ ఉగాది వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహరాలు తెలియజేస్తాయని అన్నారు. మహిళలు తమ లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని అంతకంటే ముందు శారీరక, మానసిక ఒత్తిడిని దూరం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నించాలని సూచించారు. మహిళలచే ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఎంతగానో ఆకట్టుకుంటుందని స్వయంకృషితో ముందుకు సాగుతున్న మహిళలందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. వందన సమర్పణను గాంధీనగర్ లేడీస్ క్లబ్ సెక్రెటరీ ప్రాణేశ్వరి చేయగా, ముఖ్య అతిథిని ఇందిరా దత్ తోపాటు లేడీస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ దివ్యా రెడ్డి తదితరులు
ఘనంగా సత్కరించారు. ఇందులో ప్రముఖాంద్ర సంపాదకులు గోటేటి వెంకటేశ్వరరావు, మహిళా సభ్యులు పాల్గొన్నారు. ముందుగా పంచాంగ పఠనం రామకృష్ణ పంతులు చేశారు. ఉగాది విశిష్టతను ఆనంది మోహన్ వివరించారు. క్రోధి నామ సంవత్సరంలో ఆయా రాశుల వారికి చేకూరే ప్రయోజనాలు, నష్టాలు, తీసుకోవాల్సిన, ఆచరించాల్సిన నియమాలను తెలియజేశారు. అలాగే తమిళ నూతన సంవత్సరం గురించి తెలిపారు. భక్తిగీతాలను చిన్నారి కె. కైవల్య ఆలపించి ఆకట్టుకుంది. ఈ వేడుకల సందర్భంగా మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహించేలా శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగి ఎగ్జిబీషన్ కమ్ సేల్స్ కు అనూహ్య స్పందన లభించింది.
…………………….