టికెట్ రాలేదని మనస్థాపంతో ఎంపీ ఆత్మహత్య

టీ నగర్ న్యూస్:టికెట్ రాలేదని మనస్తాపంతో తమిళనాడుకు చెందిన ఎండిఎంకె ఎంపీ (ఈరోడ్) గణేశమూర్తి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గత కొన్ని రోజులుగా కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో కన్నుమూశారు.ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని మనస్తాపానికి గురైన గణేశమూర్తి ఆదివారం (మార్చి 24వ తేదీన) తన నివాసంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను కొయంబత్తూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. చికిత్స పొందుతున్న గణేశమూర్తికి ఇవాళ ఉదయం హార్ట్ ఎటాక్ రావడం వల్ల మరణించారని ఆస్పత్రి ప్రకటించింది.

2019 లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే తో పొత్తులో భాగంగా ఎండిఎంకే తరఫున ఈరోడ్ నుంచి గణేశమూర్తి పోటీ చేసి ఉదయ సూర్యన్ గుర్తుపై గెలిచారు. ఇప్పుడు కూడా పోటీ చేయాలనుకున్న గణేశమూర్తికి ఎండిఎంకే అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన మనస్తాపానికి గురైనట్లు సమాచారం.