వైభవంగా సీతారామ కల్యాణ మహోత్సవం

విల్లివాకం న్యూస్: శ్రీ ఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో శ్రీరామ నవమి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం సీతారామ కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. దీనికి చెన్నై, కొరట్టూరు అగ్రహారం, అన్నై అవెన్యూలోని రామాలయ ప్రాంగణం వేదికయింది. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

భక్తులకు వడపప్పు, పానకాలను పంచిపెట్టారు. అనంతరం వేద పండితులు శాస్త్రోక్తంగా సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు. ఇందులో 1,200 మందికి పైగా భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.

సంస్థ అధ్యక్షులు జెయం నాయుడు, సలహాదారులు ఎమ్మెస్ మూర్తి, ప్రధాన కార్యదర్శి జె శ్రీనివాస్, కోశాధికారి జీవి రమణ, ఉపాధ్యక్షులు విఎన్ హరినాథ్, పి సరస్వతి, కెఎన్ సురేష్ బాబు చక్కగా ఏర్పాట్లు చేశారు. చివరిగా భక్తులకు అన్న ప్రసాదాలను అందజేశారు.