టి20 వరల్డ్ కప్ విజేత భారత్…. పోరాడివోడిన సౌత్ ఆఫ్రికా

చెన్నై న్యూస్ :టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా 7 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది.

రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను రోహిత్ సేన సొంతం చేసుకుంది. 17ఏళ్ల తర్వాత మరోసారి టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా నిలిచింది. భారత్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులకే ఓటమి పాలైంది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో సౌతాఫ్రికా లక్ష్య ఛేదనలో విఫలమైంది.

దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో హెన్రిచ్ క్లాసెస్ (52) హాఫ్ సెంచరీ నమోదు చేయగా, క్వింటన్ డికాక్ (39), ట్రిస్టన్ స్టబ్స్ (31), డేవిడ్ మిల్లర్ (21) రాణించారు. మిగతా ఆటగాళ్లలో రీజా హెండ్రిక్స్ (4), కెప్టెన్ ఐడెన్ మార్ర్కామ్ (4), మార్కో జాన్సెన్ (2), రబడా (4) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కేశవ్ మహారాజ్ (2), అన్రిచ్ (1)తో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, బుమ్రా, హార్దిక్ పాండ్యా తలో 2 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.