డబ్ల్యుటిఎఫ్ ఆధ్వర్యంలో తెలుగు శిక్షణ తరగతులు ప్రారంభం

విల్లివాకం న్యూస్: ప్రపంచ తెలుగు సమాఖ్య (డబ్ల్యూటిఎఫ్) ఆధ్వర్యంలో నాలుగు నెలల పాటు నిర్వహించనున్న ఉచిత తెలుగు భాష శిక్షణ తరగతులు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక టీ.నగర్ లోని డబ్ల్యూటీఎఫ్ ప్రధాన కార్యాలయంలో ప్రార్ధనా గీతంతో ప్రారంభమైన ఈ శిబిరంలో కార్యదర్శి శ్రీలక్ష్మీ మోహన్ రావు స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా డబ్ల్యూటిఎఫ్ అధ్యక్షురాలు డాక్టర్ విఎల్ ఇందిరా దత్ తెలుగు శిక్షణా శిబిరం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పంపించిన అభినందన సందేశాన్ని సభకు చదివి వినిపించారు.

2006 నుంచి డబ్ల్యూటిఎఫ్ నిర్వహిస్తున్న ఉచిత తెలుగు తరగతులు ద్వారా ఇప్పటి వరకు సుమారు 5 వేల మందికి పైగా ఇతర భాషల వారు తెలుగు నేర్చుకుని లబ్ది పొందారని, ఈ ఏడాది 4 నెలల పాటు చక్కగా తెలుగు శిక్షణా తరగతులు నిర్వహించేందుకు తనవంతు కృషి చేస్తానని ఇందిరా దత్ హామీ ఇచ్చారని తెలిపారు.


ముఖ్యంగా మాతృ భాషను ప్రతీ తెలుగు కుటుంబం లోని సభ్యులందరూ పట్టుదలగా నేర్చుకుని భాషా పరిరక్షణకు ముందుకు రావాలని శ్రీలక్ష్మిమోహన్ రావు పిలుపునిచ్చారు. తొలిరోజు శిక్షణ తరగతులు 60 మంది విచ్చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు. కాగా నాలుగు నెలల ఈ శిక్షణ తరగతులు ప్రతీ శనివారం సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు స్పోకెన్ తెలుగు , 4 గంటల నుంచి 5 గంటల వరకు చదవడం రాయటంపై తెలుగు పండిట్ మోహన్, డబ్ల్యూటిఎఫ్ సభ్యురాలు మాణిక్యం , కో-ఆర్థినేటర్ డాక్టర్ శివకుమారి నేర్పుతారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డబ్ల్యూటిఎఫ్ పూర్వ సెక్రెటరీ జనరల్ ఎం.ఆది శేషయ్య , డిఎల్ఎన్ రెడ్డి, కోశాధికారి వెంకట్ మాదాల, సంయుక్త కోశాధికారి రుక్మిణీ దేవి, సభ్యులు లలితా సుధాకర్, సురేఖ మోహన్ దాస్, నిర్మలాదేవి, మీడియా ఇన్ ఛార్జి గోటేటి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
……………