రామచంద్ర యాదవ్ పై దాడిని ఖండిస్తున్నాం!
… ద్రావిడ దేశం కృష్ణారావు

విల్లివాకం న్యూస్: చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ సదుం మండలం ఎర్రాతివారిపల్లె గ్రామంలో సోమవారం నాడు తన పార్టీ కార్యకర్తలతో కలిసి తీవ్ర ప్రచారంలో ఉన్న సమయంలో అదే నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులుగా చెబుతున్న కొందరు అల్లరి మూకలు బీసీవై పార్టీ కార్యకర్తలను తీవ్రంగా కొట్టడమే కాకుండా అనేక వాహనాలను పెట్రోల్ పోసి తగలబెట్టడం, వాహనాలపై రాళ్లతో దాడి చేయడం లాంటి అనేక ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను ద్రావిడ దేశం అధ్యక్షుడు వి.కృష్ణారావు తీవ్రంగా ఖండించారు. స్వాతంత్రం వచ్చిన పిదప రెండే రెండు ఆదిపత్య వర్గాల వారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను శాసిస్తూ సంఖ్యాపరంగా ఎక్కువ శాతం ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాల వారిని కేవలం తమ ఓటు బ్యాంకు గానే ఉపయోగించుకుoటున్నారే తప్ప ఈ వర్గాల వారికి రాజ్యాధికారo దక్కకుండా చేస్తున్నారు. ఇటీవలే ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల వారిచే నూతనంగా ఏర్పాటు చేసిన బీసీవై పార్టీని ఎదగకుండా చేయాలని కొందరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ లెక్క చేయకుండా ఎంతో ధైర్యంతో రాజకీయం చేస్తున్న రామచంద్ర యాదవ్ ను ఎన్నో విధాలుగా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు జరిగినా పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప నిందితులపై చర్యలు తీసుకోక పోవటం ప్రజాస్వామ్యానికి చీకటి రోజులని కృష్ణారావు అన్నారు. సోమవారం నాడు పుంగనూరులో దౌర్జన్యాలకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కృష్ణారావు డిమాండ్ చేశారు. బీసీవై పార్టీ అధినేతకు, ఆ పార్టీ కార్యకర్తలకు ఎన్నికల కమిషన్ మరియు పోలీసు యంత్రాంగం తగినంత భద్రత కల్పించి శాంతియుత వాతావరణo కల్పించవలసిందిగా కృష్ణారావు కోరారు.